|
| నేటి రాజకీయాల చుట్టూ తిరిగే 'మేస్త్రీ' |
| శుక్రవారం, 13 మార్చి 2009 ( 16:15 IST ) | |
రాజకీయాల గురించి దర్శకరత్న ఎక్కుపెట్టిన మరో వ్యంగాస్త్రం మేస్త్రీ. కథ భూ వివాదానికి సంబంధించిందైనా తనదైన వ్యంగ్యంతో మనకు బాగా తెలిసిన దానిగురించే చెబుతున్నారనిపించేలా దాసరి ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు ప్రేక్షకుల బుర్రకు పదునుపెట్టేవే. మొత్తంగా ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాలనుకున్నారన్న విషయం సినిమా పూర్తయ్యేలోపే మనకు దాదాపుగా తెలిసిపోతుంది.
నటీనటులు... దాసరి నారాయణరావు, చంద్రమోహన్, నర్రా వెంకటేశ్వరరావు, ఎం.ఎస్. నారాయణ, గిరిబాబు, మోహన్ బాబు, శ్రీహరి, విజయ్ కుమార్, సుజిత, ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, షాయాజీ షిండే, సుధ తదితరులు.
సాంకేతిక వర్గం... కథ, స్క్రీన్ప్లే.. దాసరి నారాయణరావు, నిర్మాత.. కె. రామకృష్ణ ప్రసాద్, దర్శకత్వం.. సురేష్ కృష్ణ..
పాయింట్.. భూ సమస్య కోసం మేజర్ తిరుగుబాటు. పంచ్ లైన్.. పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు.
సహజంగా దాసరి సినిమా అంటేనే కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. అందులోనూ రాజకీయ నేపథ్యం అనే సరికి మరింతగా ఉంటుంది. వెరసి ఈ చిత్రంలో తను చెప్పదలచుకున్న విషయాన్ని దాసరి క్లుప్తంగా చెప్పాడు. ప్రధానం షిప్యార్డ్ కార్మికులకిచ్చే ప్రభుత్వ భూమి చుట్టూ కథ తిరుగుతుంది. "మా భూమి" చిత్రం నుంచి ఇలాంటి కథలు చాలానే వచ్చాయి.
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో, దానికి అనుగుణంగా కథను మార్చుకుని దాసరి చేసిన ప్రయత్నమే "మేస్త్రీ". ముఖ్యంగా ఓటుహక్కు అంటే సెలవుతీసుకోవడం కాదు. ఓటు వేయనివాడు.. దేశద్రోహితో సమానమని పాట ద్వారా వెల్లడించాడు. అన్నీ ఉచితాలంటూ చెప్పే పార్టీనాయకులను నమ్మొద్దని ప్రజలను మేస్త్రీ హెచ్చరించాడు.
సీఎం కావాలనుకునే స్వాతంత్ర్య సమరయోధుడి 52 ఏళ్ళ కోరికను తీర్చేందుకు.. ప్రస్తుత నాయకులు చేసే కుట్రలు, కుతంత్రాలు ఎలా చేస్తారో? ఆ పాత్ర ద్వారా చూపాడు. స్వరాజ్యం పార్టీ పేరు పెట్టి "సామాజిక న్యాయం" అజెండాగా పెట్టడం.. దానికి అర్థమేమిటని అడిగితే.. దానికోసం వెతుకుతున్నామని చెప్పించే డైలాగ్లు ఓ పార్టీనుద్దేశించి అనేది చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.
సినిమా పరంగా చూస్తే.. ఇవన్నీ సహజమే కదా అనిపిస్తుంది. ఎలాగూ దాసరి డైలాగ్లకు రెండువైపులా పదునుంటుంది గనుక.. అటు పలానా వాడిని విమర్శించినట్లుగానూ, లేనట్లుగానూ ఉంటుంది. వెరసి ఈ చిత్రానికి చిరంజీవిపై సెటైర్గా ప్రచారం జరగడం కొంత మైనస్సే అవుతుంది.
ఇక కథలోకి వెళితే.. షిప్యార్డ్ కార్మికుల ఇళ్ళ స్థలాల కోసం స్వాతంత్ర్యసమరయోధుడు గోపాలకృష్ణయ్య (విజయ్ కుమార్) పోరాడుతుంటాడు. ప్రభుత్వం కూడా జీవో జారీ చేస్తుంది. కానీ దాన్ని తొక్కిపెట్టి షిప్యార్డ్ అధినేతలు సుబ్బరాజు (ప్రదీప్ రావత్), అతని సోదరుడు ఆదిరాజు (షాయాజీ షిండే) తమ సొంతం చేసుకుంటారు.
ఇదిలా ఉండగా ఓ రోజు షిప్ యార్డ్ కార్మికులంతా తమ హక్కుకోసం సమ్మె చేయాలని అనుకుంటారు. అదే సమయంలో కొత్తగా చేరిన పాలకొల్లు (ఇది ఊరుపేరు కాదు వ్యక్తిపేరు) (ఆయనే దాసరినారాయణరావు) కార్మికులకు సలహా ఇస్తాడు. ఆ సలహాతో కార్మికులంతా సమ్మె విరమించి ఆయన్నే మేధావిగా గుర్తించి "మేస్త్రీ" అనే పదవిని అప్పగిస్తారు.
ఆ తర్వాత మేస్త్రీ కార్మికుల కోసం ఒక్కో పనిని నెరవేరుస్తుంటాడు. ఓ సందర్భంలో సుబ్బరాజును కాపాడుతాడు మేస్త్రీ. కానీ అతను మేస్త్రీ కాదని "మేజర్ నరసింహమ"ని సుబ్బరాజుకు తెలుస్తుంది.
ఇక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్. మేజర్ నరసింహం శిష్యుడు మేజర్ దేవరాజ్ (మోహన్ బాబు). అతనొక దళితుడు. తెలుగువాడు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడినందుకు రాష్ట్రపతిచే సత్కరించబడి ఐదు ఎకరాల స్థలాన్ని బహుమతిగా పొందుతాడు. దానికోసం ఊరికి తిరిగి వస్తాడు.
అయితే ఆ భూమి ఆ ఊరిని శాసించే వ్యక్తి చేతిలో ఉందని తెలుస్తుంది. దానికోసం కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో.. డైరెక్ట్గా కబ్జాచేసిన పల్లంరాజుతో దేవరాజ్ ఢీకొంటాడు. ఆ ఘటనతో తను ప్రాణాలు కోల్పోతాడు. అతని కూతురు గాయాలతో బయటపడుతుంది.
ఈమె ద్వారా మేజర్ నరసింహం విషయాలు తెలుసుకుని, ఆ పెద్దలకు బుద్ది చెప్పడానికి మేస్త్రీగా అవతారమెత్తాడు. కానీ కబ్జాదారుల వెనుక ఓ ప్రముఖ వ్యక్తి కొండంత అండగా ఉన్నాడని గ్రహిస్తాడు? ఆ వ్యక్తి ఎవరు? ఆయన్ను మేస్త్రీ ఎలా ఢీ కొన్నాడు? చివరికి కార్మికులకు భూమి ఎలా దక్కేలా చేశాడు? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ.. ఈ చిత్రాన్ని చూస్తుంటే.. సురేష్ కృష్ణ బ్రాండ్ భాషా గుర్తుకురాకమానదు. అలాగే మేజర్ దాసరినారాయణ రావు కలెక్టర్, పోలీస్, మంత్రులతో మాట్లాడేతీరు, మేజర్ చంద్రకాంత్ను తలపిస్తుంది. మా అభిమాన హీరో రోడ్షోకు వస్తుంటే, తామంతా ఖర్చుచేయాలని డబ్బుకోసం తల్లిదండ్రులను ఆశ్రయించే యువకులకు, నాగమల్లి అనే పాట ద్వారా దాసరి కనువిప్పు కలిగించాడు.
అలాగే విజయ్ చందర్ పార్టీ పెట్టడం, ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ కోసం 3,5 కోట్లు అడుగుతున్నాడనే డైలాగ్లు.. చిరంజీవి నుద్దేశించినవిగా అనిపిస్తాయి. బాలగర్జన అంటూ వస్తున్నారనే దానికి, బాలలను భయపెట్టకండి, వారిని బతకనివ్వండని మరో పార్టీనుద్దేశించి చెప్పినట్లుగా దాసరి డైలాగ్లున్నాయి.
రాజకీయ చిత్రం గనుక ఏది మాట్లాడినా, ఏదో నాయకుడిపై సెటైర్గానే అనిపించడం మామూలే. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి చిత్రాన్ని తీశాడు గనుక బాగానే ఉందని సినీ పండితులు అంటున్నారు. కానీ చివరిగా ఓటు హక్కు గురించి వివరించిన పాటతో కథ ముగుస్తుంది.
కానీ కొత్తగా పెట్టిన పార్టీనాయకుడు ప్రజలచేత ఛీ కొట్టబడితే.. ఇక మిగిలింది.. రూలింగ్ పార్టీ వ్యక్తే.. ఆయనకే ఓటువేయండని అన్యాపదేశంగా దాసరి చెప్పినట్లుగా ఈ సినిమా ఉంది.
పని విధానం ఎలా ఉందంటే..? ఈ చిత్రం కోసం పనిచేసిన కళాకారుల పనివిధానం బాగానే ఉంది. మోహన్ బాబు సెకండాఫ్లో రావడంతో ఒక్కసారిగా కథ స్పీడందుకుంటుంది. శ్రీహరి ఉద్యోగం పోయిన పోలీస్ ఆఫీసర్గా నటించాడు. ఆ తర్వాత మేస్త్రీ స్ఫూర్తితో ఉద్యోగంలోకి వెళతాడు. కానీ అక్కడ, శ్రీహరి అక్క (సుధ) కుమార్తెకు చిన్న వయస్సు. కానీ ఆమెను చాలా ఫాస్ట్గా చూపించే ప్రయత్నం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. తనే మొగుడు అనుకుని చిన్నపిల్లల చేత పలికించే డైలాగ్లు చికాకు పెట్టిస్తాయి.
ఇక సంగీతపరంగా బాగానే ఉంది. తెలుగు భాష ఔన్నత్యంపై సి. నారాయణ రెడ్డి రాసిన బాగుంది. కథను కాస్త ట్రిమ్ చేస్తే మరింత బాగుండేది. ఎక్కువ భాగం సీఎం పీఠం గురించి, ఓటుహక్కు గురించి డైలాగ్లతో కథను పక్కదోవ పట్టించినట్లుంది. చాలా కాలం తర్వాత దాసరి సమకాలీన సమస్యలతో ఓ రాజకీయ చిత్రాన్ని తీశారు. సహజంగా ఇటువంటి కథలు ఆర్. నారాయణమూర్తికి బాగాసూటవుతాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|